అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యాకు మద్దతిచ్చి భారత్ మూల్యం చెల్లించుకుంటోందని వ్యాఖ్యానించారు. మిగతా దేశాలు కూడా త్వరలోనే భారీ మూల్యం చెల్లించుకుంటాయని హెచ్చరించారు. రష్యా నుంచి డిస్కౌంట్పై చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్పై అమెరికా 50 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం తాజాగా స్పందించారు. ఈ మేరకు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలకు కీలక హెచ్చరికలు చేశారు.

భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలు రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేసి ఉక్రెయిన్పై మాస్కో యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయని విమర్శించారు. ఈ చర్యల కారణంగా అమాయకపు ప్రజలు, పిల్లలు మరణిస్తుంటే, మీరు ఎలా ఫీలవుతున్నారు? అంటూ ప్రశ్నించారు. రష్యా చమురు కొనుగోలు ఫలితంగా భారత్ ఇప్పటికే మూల్యం చెల్లించుకుంటోందని వ్యాఖ్యానించారు. మాస్కోతో వ్యాపారం కొనసాగిస్తే ఇతర దేశాలకు కూడా త్వరలోనే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయని లిండ్సే గ్రాహం తీవ్రంగా హెచ్చరించారు.
















