
విద్యను కేవలం తరగతి గోడల మద్యనే కాదు బడి ముఖం కూడా తెలియని పిల్లలకు కూడా విద్యా ఫలాలు అందించాలని నమ్మి ఆ దిశగా కృషి చేసిన భారతీయ ఉపాధ్యాయురాలు రూబుల్ నాగికి ప్రపంచ స్థాయి గౌరవం దక్కింది. దుబాయ్ లో జరిగిన వరల్డ్ గవర్నమెంట్స్ సమ్మిట్ లో ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2025 ను దుబాయ్ యువరాజు షేక్ హమ్మదన్ బిన్ మొహమ్మద్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. ఈ పురస్కారం కింద రూబుల్ నాగికి వర్కి ఫౌండేషన్ వన్ మిలియన్ డాలర్ల ( సుమారు రూ.9 కోట్లు ) నగదు బహుమతి అందించింది. దేశ వ్యాప్తంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు సుమారు 800 అభ్యాస కేంద్రాలు ఏర్పాటు చేయడం తో పాటు, వివిధ సబ్జెక్టుల చిత్రాలను మురికివాడలలో ఖాలీగా వున్నగోడలపై చిత్రీకరించి తరగతి గదిలా మార్చేశారు .గత రెండు దశాబ్దాలుగా ఈ ఆర్ట్ ని పిల్లల అభ్యాస టూల్ గా వాడి సుమారు 10 లక్షల మంది పిల్లలకు సాధారణ విద్యను అందించేందుకు కృషి చేసింది. 139 దేశాల నుండి 5000 పైగా నామినేషన్లు రాగా రూబుల్ నాగి ఎన్నికయ్యారు. ఈ పురస్కారం ద్వారా వచ్చిన సొమ్మును కూడా విద్యార్థుల వృత్తి శిక్షణ కోసం ఖర్చు చేస్తాను అని రూబుల్ నాగి అంటున్నారు.















