రష్యాలోని ఉఫా నగరంలో చోటుచేసుకున్న కత్తి దాడి ఘటన కలకలం రేపింది. ఈ దాడిలో నలుగురు భారతీయ విద్యార్థులతో పాటు మరికొందరు గాయపడినట్లు మాస్కోలోని భారత రాయబార కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. బాష్కోర్టోస్థాన్ రిపబ్లిక్లో ఉన్న ఒక స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఈ ఘటన చోటుచేసుకోగా, మొత్తం కనీసం ఆరుగురు గాయపడినట్లు సమాచారం.ఉఫాలో ఒక దురదృష్టకర దాడి జరిగింది. నలుగురు భారతీయ విద్యార్థులతో పాటు పలువురు గాయపడ్డారు. మేము స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం అని భారత ఎంబసీ వెల్లడించింది. గాయపడిన విద్యార్థులకు అవసరమైన సహాయం అందించేందుకు కజాన్లోని భారత కాన్సులేట్ అధికారులు ఉఫాకు బయలుదేరినట్లు తెలిపింది. అయితే గాయపడిన భారతీయుల వ్యక్తిగత వివరాలు ఇంకా బయటకు రాలేదు.

ప్రాథమిక నివేదికల ప్రకారం. 15 ఏళ్ల బాలుడు ఉఫాలోని స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ప్రాంగణంలోకి ప్రవేశించి డార్మిటరీ (వసతి గృహం)లోకి చొరబడ్డాడు. అక్కడ ఉన్న విద్యార్థులపై ఆకస్మికంగా కత్తితో దాడి చేసినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో యూనివర్సిటీ ప్రాంగణంలో భయాందోళనలు నెలకొన్నాయి. రష్యా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు విద్యార్థులపై దాడి చేయడమే కాకుండా, తనను అదుపులోకి తీసుకునేందుకు వచ్చిన ఇద్దరు పోలీసు అధికారులపై కూడా కత్తితో దాడి చేశాడు. అరెస్టును ప్రతిఘటించే క్రమంలో ఇద్దరు పోలీసులకు గాయాలు అయ్యాయి. అనంతరం నిందితుడు తనను తాను కూడా గాయపరుచుకున్నాడు” అని మంత్రిత్వ శాఖ ప్రతినిధి మేజర్ జనరల్ ఇరినా వోల్క్ తెలిపారు.















