పశ్చిమాసియా యుద్ధాన్ని కొన్ని రోజులు విరమించేందుకు ఇరాన్ ససేమిరా అంటోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన దాడుల విరమణను ఇరాన్ నిర్మొహమాటంగా తిరస్కరించింది. సంధి కుదిర్చేందుకు ముందుకొచ్చిన పాకిస్థాన్కు టెహ్రాన్ తమ స్పందనను తెలియజేసింది. తాత్కాలిక సంధికి, విరణమణకు టెహ్రాన్ సిద్ధంగా లేదని, యుద్ధాన్ని శాశ్వతంగా ముగించడానికే తాము ప్రధాన్యమిస్తున్నామని అమెరికాకు ఇరాన్ మరోసారి స్పష్టం చేసింది. హర్మూజ్ జలసంధిని తెరవకుంటే ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై, బ్రిడ్జ్లపై దాడులు చేస్తామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించినా టెహ్రాన్ అదరడం లేదు. హర్మూజ్ను తెరవడం కోసం యుద్ధాన్ని తాత్కాలికంగా విరమించేందుకు అమెరికా చేసిన ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించింది. మేము తాత్కాలికంగా యుద్ధాన్ని విరమించాలనే ప్రతిపాదనను తోసిపుచ్చుతున్నాం. మాకు యుద్ధానికి శాశ్వత ముగింపు కావాలి అని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఫిరదౌసీ పూర్ అమెరికకు తేల్చి చెప్పారు. తాము యుద్ధాన్ని విరమించేందుకు అంగీకరించాలంటే యూఎస్ఏ పది షరతులకు అంగీకరించాలని ఆయన స్పష్టం చేశారు.

ఇరాన్ సరిహద్దుల వెంబడే కాకుండా లెబనాన్, గాజాలోనూ మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తనీయమనే హామీ ఇవ్వాలి. హర్మూజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణాధికారాన్ని ఆమోదించాలి. ఈ సంధిలో నౌకల రవాణాను నియంత్రించడం, టోల్ వసూలు చేసేందుకు అనుమతించాలి. ఇరాన్పై విధించిన ఆర్ధిక ఆంక్షలను ఎత్తేయాలి. అంతేకాదు భవిష్యత్తులో తమ దేశంపై దాడికి పాల్పడబోమనే హామీతో సహా పది షరతులకు అంగీకరిస్తేనే తాము యుద్ధ విరమణపై ఆలోచిస్తామని ఇరాన్ కుండబద్ధలు కొట్టినట్టు చెప్పేసింది.















