జమ్మూకాశ్మీర్లో పవిత్ర అమర్ నాథ్ యాత్ర ప్రారంభమైంది. ప్రతీ సంవత్సరం దాదాపు ఇదే సమయంలో, అమర్నాథ్ గుహలో, సహజ సిద్ధంగా ఏర్పడే శివ లింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు బ్యాచ్ల రూపంలో వెళ్లడం ఆనవాయితీ. ఈ సంవత్సరం ఈ యాత్రను జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జమ్మూలోని భగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. తొలి విడతలో 5,880 మంది యాత్రికులు జమ్మూ నుంచి బయలుదేరారు. వెయ్యిమందికిపైగా మహిళలు, 31మంది చిన్నారులు, 16 మంది ట్రాన్స్జెండర్లతో కూడిన తొలి బ్యాచ్ బేస్ క్యాంప్ను వీడినట్టు అధికారులు తెలిపారు.

ఈ యాత్ర 38 రోజుల పాటు జరుగునుంది. ఆ తర్వాత శివలింగం కరిగిపోతుంది. అందువల్ల ఆగస్టు 9 నాడు యాత్ర ముగుస్తుంది. ఈ సంవత్సరం యాత్ర కోసం 3.5 లక్షల మంది భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ యాత్ర పహల్గామ్, బాల్తాల్ అనే రెండు మార్గాల ద్వారా సాగుతుంది. పహల్గామ్ మార్గం 48 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బాల్తాల్ మార్గం 14 కిలోమీటర్ల దూరంతో ఉంటుంది. కానీ, ఇది చాలా ఎక్కువ ఎత్తుతో ఉంటుంది. ఇది చిన్న మార్గమే కానీ, కష్టమైన మార్గంగా ఉంది. ఈ రెండు మార్గాల్లోనూ యాత్రికులకు సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేశారు. పహల్గామ్లో ఈ మధ్య ఉగ్ర దాడి జరిగినా, యాత్రకు భారీ రెస్పాన్స్ రావడం మంచి విషయం.
















