ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న లెజెండరీ యాక్టర్లలో టాప్లో ఉంటారు ఉలగనాయగన్ కమల్హాసన్ , సూపర్ స్టార్ రజినీకాంత్. ఈ ఇద్దరూ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. తలైవా, కమల్ ఒకే ఫ్రేమ్లో కనిపించారంటే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దేశవ్యాప్తంగా వీరిద్దరికి ఉన్న అభిమానగణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇదిలావుండగా 21 ఏండ్ల తర్వాత ఈ సూపర్స్టార్స్ ఇద్దరూ ఒకే స్టూడియోలో తమ సినిమాల షూటింగ్స్ సందర్భంగా కలుసుకోవడం విశేషం. కమల్హాసన్ ఇండియన్-2 షూటింగ్ చెన్నైలోని ప్రసాద్ స్టూడియో ఎరీనాలో జరుగుతున్నది. దీనికి సమీపంలోనే రజనీకాంత్ 170వ చిత్రం షూటింగ్ జరుగుతున్నది.
ఈ విషయం తెలుసుకున్న అగ్ర హీరోలిద్దరూ షూటింగ్ లొకేషన్లో కలుసుకున్నారు. 21 సంవత్సరాల తర్వాత షూటింగ్ లొకేషన్లో వీరిద్దరు కలుసుకున్నారని, ఇదొక ప్రత్యేక సందర్భమని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కమల్హాసన్, రజనీకాంత్ తమ చిత్రాల తాలూకు గత స్మృతులను గుర్తు చేసుకున్నారు. గతంలో బాబా, పంచతంత్రం సినిమాల షూటింగ్ సందర్భంగా వీరిద్దరూ కలుసుకున్నారు. ఇది జరిగి 21 సంవత్సరాలు అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో లైకా ప్రొడక్షన్స్ హెడ్: జి.కె.ఎం.తమిళ్ కుమరన్, రెడ్ జెయింట్ మూవీస్ కో ప్రొడ్యూసర్ ఎం. సెంబగ మూర్తి పాల్గొన్నారు.