అమెరికాలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు కు చేదు అనుభవం ఎదురైంది. న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ లో ప్రసంగిస్తున్న సమయంలో పలు దేశాలకు చెందిన ప్రతినిధులు వాకౌట్ చేశారు. చాలా వరకూ కుర్చీలు ఖాళీ అయ్యాయి. నెతన్యాహు తన ప్రసంగాన్ని ప్రారంభించగానే హాలులో అర్ధం కాని అరుపులు ప్రతిధ్వనించాయి. అయినప్పటికీ నెతన్యాహు తన ప్రసంగాన్ని కొనసాగించారు.

హమాస్కు వ్యతిరేకంగా గాజాలో ఇజ్రాయెల్ చేపట్టిన పనిని పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు. గాజాలో వినాశకరమైన యుద్ధాన్ని ఆపడానికి నిరాకరించడంపై అంతర్జాతీయంగా ఒంటరి అవుతున్నప్పటికీ తాను వెనక్కి తగ్గేదే లేదని, తన వైఖరిలో మార్పు రాదని తేల్చి చెప్పారు. హమాస్ అంతానికి గాజాలో తాము ప్రారంభించిన పనిని పూర్తి చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నట్టు చెప్పారు.
















