

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలను ఛార్లెట్లోని టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సందడిగా జరుపుకున్నారు. ఛార్లెట్లోని కంఫర్ట్ ఇన్ సూట్స్ లో జరిగిన ఈ వేడుకలకు భారీ సంఖ్యలో టిడిపి నాయకులు, ఎన్నారైలు హాజరయ్యారు. నభూతో నభవిష్యతి అన్న రీతిలో జరిపారు. ఎన్నారై టీడీపీ పార్టీ నాయకులతో కలిసి పిల్లలు, మహిళలు చంద్రబాబు పుట్టినరోజు కేక్ కట్ చేశారు.


ఈ సందర్భంగా గుడివాడ శాసనసభ్యుడు, ఎన్నారై వెనిగళ్ళ రాము మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75 ఏళ్ళు వచ్చినప్పటికీ నేటికీ 18 గంటలకుపైగా పనిచేస్తున్నారని ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమం కోసం కృషి చేసే విజనరీ ఉన్న నాయకుడని కొనియాడారు. చాలామంది 60 ఏళ్లు వచ్చిన తరువాత రిటైర్మెంట్ అయ్యామంటూ పనుల నుంచి విశ్రాంతి తీసుకుంటారని, కాని చంద్రబాబు నాయుడు 75 ఏళ్ళు వచ్చినప్పటికీ ప్రజలకోసం పనిచేయడం తనకు ఇష్టమని అంటూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికోసం నిరంతరం తపిస్తూ ఉన్నారని కొనియాడారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ఛార్లెట్ టిడిపి నాయకులు కూడా చంద్రబాబు చేస్తున్న సేవలను ప్రశంసిస్తూ మాట్లాడారు.


ఈ కార్యక్రమాన్ని ఛార్లెట్ ఎన్నారై టీడీపీ స్థానిక నాయకులు నాగ పంచుమర్తి, ఠాగూర్ మల్లినేని, సతీష్ నాగభైరవ, బాలాజి తాతినేని మరియు ఇతర ఎన్నారై టీడీపీ కార్యవర్గ సభ్యులు సమన్వయపరచారు. చివరన ఈ కార్యక్రమాన్ని విజయంతం చేసిన వారందరికీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.

