భారత్ పట్ల చైనా తన వక్రబుద్ధిని మరోసారి చాటుకున్నది. జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్లో జరుగనున్న జీ20 సదస్సుకు తాము హాజరుకావడం లేదని ప్రకటించింది. వివాదాస్పద భూభాగంలో సమావేశాలు జరపడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని చెప్పింది. కశ్మీర్లో నిర్వహించే ఇలాంటి భేటీలకు తాము వచ్చేది లేదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ అన్నారు. శ్రీనగర్లో జీ20 సమావేశాలు నిర్వహించడంపై చైనా అభ్యంతరం వ్యక్తంచేయడం ఇదే మొదటిసారి. అయితే కశ్మీర్పై ఎప్పుడూ భారత్కు వ్యతిరేకంగా వ్యవహరించే టర్కీ, సౌదీ అరేబియా లాంటి దేశాలు జీ20 సమావేశాల నిర్వహణపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.


