అమెరికా హౌజ్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటించిన నేపథ్యంలో ఆ దేశంపై చైనా తన ప్రతీకారాన్ని తీర్చుకున్నది. ఈ నేపథ్యంలో తైవాన్ పై చైనా కక్ష సాధింంపు చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా తైవాన్ నుంచి దిగుమతి చేసుకునే పండ్లు, చేపలపై ఆంక్షలను ప్రకటించింది. ఇక తైవాన్ ద్వీపానికి పంపనున్న ఇసుక రవాణాను నిలిపివేస్తున్నట్లు చైనా ప్రకటించింది. అమెరికాలో హై ప్రొఫైల్ పదవిలో ఉన్న పెలోసీ తైవాన్లో పర్యటించడం వల్ల చైనాతో దౌత్యపరమైన సమస్యలు తలెత్తాయి. సిట్రస్ జాతికి చెందిన కొన్ని రకాల పండ్లు, చేపల దిగుమతిని సస్పెండ్ చేస్తున్నట్లు చైనా కస్టమ్స్ శాఖ తెలిపింది. పండ్లు, చేపల్లో క్రిమిసంహారకాలు ఎక్కువ శాతం ఉంటున్నాయని, కొన్ని ప్యాకెట్లలో కరోనా టెస్టు పాజటివ్ వస్తుందని కస్టమ్స్ శాఖ తెలిపింది. సహజమైన ఇసుకను తైవాన్కు ఎగుమతి చేసే అంశంపై నిషేధిస్తూ కారణాలను వెల్లడిరచకుండానే నోటీసులు జారీ చేసింది. ఇలా తైవాన్ ఎగుమతులపై చైనా నిషేధించడం తొలిసారి కాదు. ఇలా మార్చి 2021లో తైవాన్ ఎగుమతి చేసే పైనాపిల్లో అధిక రసాయనాల అవశేషాలు ఉన్నాయంటూ నిషేధించింది. అదీగాక 2016 నుంచి తైవాన్ అధ్యక్షురాలిగా సాయ్ ఇంగ్ వెన్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి తైవాన్ పై ఒత్తిడి పెంచింది చైనా. ఆమె తమ దేశాన్ని సార్వభౌమ దేశంగానూ, వన్ చైనాలో భాగంగా కాదు అన్నట్లుగా భావించడంతోనే చైనా ఈ సాధింపు చర్యలకు పాల్పడుతోంది.














