చైనాకు చెందిన ఒక కంపెనీ యజమాని ఏకంగా 180 మిలియన్ యువాన్లు (రూ.240 కోట్లు) తన ఉద్యోగులకు బోనస్గా అందజేశారు. అదీ కూడా ఒక్కొక్కరికీ ఇంత మొత్తమని నిర్దేశించకుండా మీరు ఎంత లెక్కపెడతారో అంతా తీసుకుని వెళ్లమంటూ బంపరాఫర్ ఇచ్చారు. హెనాన్ కువాంగ్షా క్రేన్ లిమిటెడ్ అనే కంపెనీ ఈ ఏడాది ఆర్జించిన 270 మిలియన్ యువాన్ల లాభంలో సుమారు 70 శాతాన్ని తన ఉద్యోగులకే పంచేసింది. దీని కోసం పెద్ద హాల్లో 800 టేబుల్స్ వేసి వాటిపై కుప్పలు కుప్పల నోట్లను పరిచింది. నిర్దేశిత సమయంలో ఉద్యోగులు అందులోంచి ఎన్ని నోట్లు లెక్కపెడతారో అవన్నీ వారివేనని ప్రకటించడంతో వారు చకచకా వాటిని లెక్కపెట్టి కట్టలు కట్టి ఆనందంగా తీసుకుపోయారు.

నోట్లు వేగంగా లెక్కపెట్టడం కోసం కొందరైతే కొన్ని రోజుల పాటు శిక్షణ కూడా పొందారని తెలిసింది. అనంతరం సిబ్బందికి వాషింగ్ మెషీన్లు కూడా అందజేశారు. అంతేకాక కారు లోన్లు, మార్టిగేజ్ లోన్లతో ఇబ్బంది పడుతున్న యువ సిబ్బంది తమను సంప్రదిస్తే ఆర్థికంగా సహాయం చేస్తామని ప్రకటించారు. కాగా, 2002లో స్థాపించిన ఈ కంపెనీ 130 దేశాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నది.















