
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే గోల్డ్ కార్డు ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న పెట్టుబడి వీసా ఈబీ-5 స్థానంలో గోల్డ్ కార్డు తీసుకురానున్నట్లు వెల్లడించారు. 5 మిలియన్ డాలర్లు (సుమారు 44 కోట్లు) చెల్లించగలిగే వారికి నేరుగా అమెరికా పౌరసత్వాన్ని ఇవ్వనున్నారు. ట్రంప్ ప్రకటించిన ఈ గోల్డ్ కార్డుకు అమెరికాలో భారీ గిరాకీ ఉన్నట్లు తెలుస్తోంది.

కేవలం ఒక్కరోజులోనే ఏకంగా 1,000 గోల్డ్ కార్డులు విక్రయించినట్లు వాణిజ్యశాఖ మంత్రి హోవర్డ్ లుట్నిక్ తాజాగా వెల్లడించారు. వీటి ద్వారా దాదాపు 5 బిలియన్ డాలర్లు సేకరించినట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా 37 మిలియన్ల మందికి గోల్డ్ కార్డును కొనుగోలు చేయగల సామర్థ్యం ఉంది. ఒక మిలియన్ మంది వీటిని కొనుగోలు చేస్తారని అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నారు. వీటిద్వారా 5 ట్రిలియన్ డాలర్లు సేకరించే అవకాశం ఉంది అని లుట్నిక్ పేర్కొన్నారు.
