
తనను భారత్కు అప్పగించవద్దు అని 2008 ముంబై ఉగ్రదాడి నిందితుడు తహవుర్ రాణా పెట్టుకున్న పిటీషన్ను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. తన అప్పగింతపై అత్యవసరంగా స్టే విధించాలని సుప్రీంకోర్టులో రాణా అప్పీల్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇండియాకు తనను అప్పగిస్తే, ఆ దేశం తనను చిత్రహింస పెడుతుందని తన అభ్యర్థన లేఖలో అమెరికా సుప్రీంకోర్టుకు రాణా తెలిపాడు. అందుకే అప్పగింతపై తక్షణమే స్టే విధించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరాడు.

తాను పాకిస్థానీ సంతతికి చెందిన ముస్లింనని, తాను పాకిస్థానీ సైన్యానికి చెందిన మాజీ సభ్యుడినని అతను తెలిపాడు. ఈ కారణంగానే కస్టడీలో తనను చిత్రహింసలు పెడతారని అనుమానించవలసి వస్తోందని, తనను ప్రమాదకర పరిస్థితిలోకి నెట్టవద్దని కోర్టును రాణా అభ్యర్థించాడు. పాకిస్థానీ అమెరికా ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీకి సన్నిహితుడు తహవూర్ రాణా. 2008, నవంబర్ 26వ తేదీన ముంబైలో జరిగిన ఉగ్ర పేలుళ్లలో హేడ్లీ ప్రధాన నిందితుడు.
