తెలంగాణ ఉద్యమ గాయకుడు, ప్రజా కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ ఆకాల మరణం యావత్ ప్రవాస తెలంగాణ సమాజాన్ని తీవ్రంగా కలిచివేసిందని ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి అన్నారు. లండన్ లోని రీడింగ్ నగరంలో సాయిచంద్ సంస్మరణ కార్యక్రమంలో ప్రవాస తెలంగాణ వాదులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ మాట్లాడుతూ ఉద్యమ సమయం నుండి క్రియాశీలకంగా పనిచేస్తున్నందున మాకు సాయిచంద్తో మంచి అనుబంధముందని, మేము చేసే కార్యక్రమాల్ని మీడియా ద్వారా తెలుసుకొని మాలో చాలా మందికి ఫోన్ చేసి అభినందించి ప్రోత్సహించే మంచి వ్యక్తిత్వం, సమాజం పట్ల ఎంతో బాధ్యత ఉన్నవారు సాయిచంద్ అని గుర్తుచేసుకున్నారు.

ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న సాయిచంద్ ఇలా మరణించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని సాయిచంద్ భౌతికంగా మన మధ్య లేకపోయినా తన పాటల రూపంలో మన మధ్యే ఎల్లపుడూ చిరంజీవిగా వర్ధిల్లుతాడని తెలిపారు.సీనియర్ నాయకుడు బీరం మల్లా రెడ్డి మాట్లాడుతూ సాయిచంద్ కుటుంబానికి మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నామన్నారు. స్వదేశానికి వచ్చిన వెంటనే సాయిచంద్ కుటుంబాన్ని కలుస్తామని, భగవంతుడు ఈ విషాదాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని వారి కుటుంబానికి ఇవ్వాలని ప్రార్థిస్తున్నామని అన్నారు.

సతీష్ రెడ్డి బండ మాట్లాడుతూ ఎన్నికల అనంతరం సాయిచంద్ను లండన్ తీసుకురావాలని ఇటీవల లండన్ సందర్శనకు వచ్చిన మా సంస్థల వ్యవస్థాపకులు, ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం చెప్పారని, ఇంతలోనే ఇలా జరగడం ఎంతో బాధగా ఉందని తెలిపారు. జోహార్ సాయి చంద్ జోహార్ జోహార్ తెలంగాణ నేల నిన్ను ఎప్పటికీ మరవదని అంటూ ప్రవాసులు నినదించారు.ఈ కార్యక్రమంలో అశోక్ గౌడ్ దూసరి,బీరం మల్లా రెడ్డి, జాహ్నవి,సతీష్ రెడ్డి బండ తదితరులు పాల్గొన్నవారిలో ఉన్నారు.















