ప్రదీప్ రంగనాథన్ హీరోగా, మమితాబైజు జంటగా నటించిన సినిమా డ్యూడ్. కీర్తీశ్వరన్ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్లో ప్రదీప్ రంగనాథన్ మాట్లాడారు. లవ్ టుడే, డ్రాగన్ సినిమాల మాదిరిగానే డ్యూడ్ కూడా మీకు నచ్చుతుంది. చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. తెలుగు సినిమాతో నాకు బాగా కనెక్ట్ అవ్వాలని ఉండేది. మైత్రీ మూవీస్ ద్వారా అది నెరవేరింది. దర్శకుడు కీర్తిశ్వరన్ మంచి సినిమా తీశారు. తను ఫ్యూచర్లో పెద్ద డైరెక్టర్ అవుతాడు. మమితా బైజు అద్భుతమైన ఎనర్జీతో నటించింది. తప్పకుండా సినిమా అందరికీ నచ్చుతుంది అన్నారు.

డైరెక్టర్ కీర్తీశ్వరన్ మాట్లాడుతూ కథ రాసుకొని చెన్నై మొత్తం తిరిగాను. చివరకు హైదరాబాద్ జూబ్లీహిల్స్లో నా సినిమా జర్నీ మొదలైంది. మైత్రీ లాంటి గొప్ప సంస్థ ద్వారా దర్శకుడిగా పరిచయమవుతానని కలలో కూడా అనుకోలేదు. హీరో ప్రదీప్ ఇందులో భిన్నంగా కనిపిస్తారు. మమితాబైజుది కూడా డిఫరెంట్ క్యారక్టర్. అల్లు అర్జున్ ఆర్య ని ప్రేరణగా తీసుకొని ఈ స్క్రిప్ట్ రాశాను. దీపావళికి సరైన సినిమా ఇది అని నమ్మకంగా చెప్పారు. ఈ బ్యూటిఫుల్ లవ్స్టోరీలో స్ట్రాంగ్ ఎమోషన్స్ కూడా ఉంటాయని నిర్మాతలు రవిశంకర్, నవీన్ యర్నేని తెలిపారు. ఈ సినిమాలో నటించడం పట్ల కథానాయిక మమితా ఆనందం వెలిబుచ్చారు. ఇంకా డీవోపీ నిఖిత్ బొమ్మి, గీత రచయిత రామజోగయ్యశాస్త్రి, సంగీతం దర్శకుడు సాయి అభ్యంకర్ కూడా మాట్లాడారు. దర్శకులు హను రాఘవపూడి, బుచ్చిబాబు సాన, సాయిరాజేశ్, రాహుల్ సంకృత్యాన్, శివ నిర్వాణ అతిథులుగా విచ్చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు.
















