అలీ, నరేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా అందరూ బాగుండాలి అందులో నేనుండాలి. అలీవుడ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించారు. ఈ చిత్రాన్ని అలీబాబ, కొణతాల మోహనన్ కుమార్, ఆర్.శ్రీచరణ్ నిర్మిస్తున్నారు. శ్రీపురం కిరణ్ దర్శకుడు. ఈ సినిమా ఆహా ఓటీటీ ద్వారా ఈ నెల 28న విడుదల సిద్ధమవుతున్నది. ఈ చిత్ర టీజర్, ట్రైలర్ను ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, బ్రహ్మానందం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నటుడు ఆలీ మాట్లాడుతూ వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన మలయాళ చిత్రం వికృతి ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. ఈ కథతో సమాజానికి పనికొచ్చే ఓ మంచి సందేశం ఉంటుంది. నరేష్, నా పాత్రలు పోటా పోటీగా ఉంటాయి. 27 ఏళ్ల తర్వాత మంజు భార్గవి గారితో కలిసి నటించడం ఆనందంగా ఉంది. చాలా మంది పేరున్న నటీనటులు ఈ సినిమాలో తమ నటనతో మిమ్మల్ని అలరిస్తారు అన్నారు.
దర్శకుడు శ్రీపురం కిరణ్ మాట్లాడుతూ దాదాపు 1200 చిత్రాల్లో నటించిన ఆలీ నిర్మాతగా చేస్తున్న మొదటి చిత్రానికి దర్శకుడిని కావడం సంతోషంగా ఉంది అన్నారు. ఇందులో ఎందో మంది సీనియర్ ఆర్టిస్ట్లు ఉన్నా అందరూ నాకు మంచి సహకారం అందించారు. మురళీ మోహన్ రెడ్డి కెమెరా వర్క్, రాకేశ్ పళిడమ్ సంగీతం సినిమాకి అదనపు ఆకర్షణ. మా ప్రయత్నాన్ని అందరూ ఆదరించి, ఆశీర్వదించాలని కోరుతున్నా అన్నారు. ఈ కార్యక్రమంలో కొణతాల మోహనన్ కుమార్, పృథ్వీ, శివ బాలాజీ, రాకేశ్, భద్రం తదితరులు పాల్గొన్నారు.














