అమెరికాలో విద్యాభ్యాసం కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు అమెరికా శుభవార్త చెప్పింది. ఇటీవల తాత్కాలికంగా నిలిపివేసిన ఇంటర్వ్యూ షెడ్యూలింగ్ను మళ్లీ ప్రారంభించింది. అయితే సోషల్మీడియా వెట్టింగ్ను తప్పనిసరి చేసింది. ప్రభుత్వ రివ్యూ కోసం విద్యార్థులు తమ సోషల్ మీడియా ఖాతా వివరాలు ఇవ్వాల్సి ఉంటుందని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. అమెరికా, అమెరికా ప్రభుత్వం, సంస్థలు, సంస్కృతి, విలువలకు వ్యతిరేకంగా విద్యార్థులు ఏమైనా పోస్టులు పెట్టారా అన్నది పరిశీలించనున్నట్టు పేర్కొన్నది.సోషల్ ఖాతాల పరిశీలనకు అనుమతించని వారి దరఖాస్తులను తిరస్కరిస్తామని స్పష్టంచేసింది.

ఈ ఏడాది మే చివరి వారం నుంచి ప్రపంచవ్యాప్తంగా అమెరికా విద్యార్థి వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. వీసా ఇంటర్వ్యూల పునరుద్ధరణ కోసం విద్యార్థులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తాజా నిబంధనల ప్రకారం దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ వివరాలను కాన్సులేట్ అధికారులకు తప్పనిసరిగా అందజేయాలి. ఈ నేపథ్యంలో దరఖాస్తుదారులకు వచ్చే కొన్ని సందేహాలకు నిపుణులు సమాధానాలిచ్చారు.
