ఆది సాయికుమార్ కథానాయకుడిగా రూపొందిన చిత్రం శంబాల. యుగంధర్ ముని దర్శకుడు. రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్రెడ్డి నిర్మాతలు. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన సక్సెస్ సెలబ్రేషన్స్కి అతిథిగా అగ్ర నిర్మాత అల్లు అరవింద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొడుకు పైకి రావడంలో తండ్రికి ఉండే ఆనందం నాకంటే ఎవరికీ తెలియదు. సాయికుమార్తో మాది మూడు తరాల అనుబంధం. తను మా కుటుంబ సభ్యుడే. ఈ రోజు అతని కుమారుడు విజయం సాధించాడు. అది మాకూ ఆనందదాయకమే. అందుకే ఈ వేడుకకు వచ్చాను అన్నారు.

శంబాల సినిమాను దర్శకుడు యుగంధర్ ముని అద్భుతంగా తెరకెక్కించారు. కథనూ, దర్శకుడ్ని నమ్మి ఈ సినిమాను నిర్మించిన నిర్మాతలకు కంగ్రాట్స్ చెబుతున్నా. ఇకనుంచి ఆది హైవే ఎక్కినట్టు దూసుకుపోవాలి. ఆది సక్సెస్ అయితే, ఎదిగితే సంతోషపడే వ్యక్తుల్లో నేను ముందుంటాను. శంబాల మూవీని చూసి నేను చాలా ఎంజాయ్ చేశాను అని అరవింద్ అన్నారు. ఈ విజయం పనిచేసిన అందరిదీ అనీ, శంబాల సినిమాను థియేటర్లోనే చూడాలని ఆది సాయికుమార్ చెప్పారు. ఇంకా చిత్రబృందమంతా మాట్లాడారు. ఈ నెల 25న సినిమా విడుదలైంది.















