
అమెరికా , యూరప్ దేశాల్లో వలసలపై ఆంక్షలతో విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లో నిర్వహించిన కార్యక్రమంలో జైశంకర్ మాట్లాడారు. వలసలు, నైపుణ్యం కలిగిన ఉద్యోగుల రాకపోకలపై మితిమీరిన ఆంక్షలు విధిస్తే, ఆ ఆంక్షలు విధించిన దేశాల సొంత ప్రయోజనాలే దెబ్బతినే అవకాశం ఉందని అన్నారు. చివరకు ఆ దేశాలే నష్టపోతాయని హెచ్చరించారు. చాలా సందర్భాల్లో అమెరికా, యూరప్ దేశాల వాళ్లే ఈ సమస్యను సృష్టించారని, కాబట్టి స్వయంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. వలసలకు సంబంధించి అమెరికా, యూరప్ దేశాల్లో ఏమైనా ఆందోళనలు ఉంటే.. అవి ఆ దేశాలు అమలు చేసిన దీర్ఘకాలిక విధానాల ఫలితమేనన్నారు. గడిచిన రెండు దశాబ్దాల్లో ఉద్దేశపూర్వకంగా అన్నీ తెలిసే తమ వ్యాపారాలను విదేశాలకు విస్తరించారని, ఇది వారి వ్యూహమని, కాబట్టి ఈ సమస్యలకు స్వయంగా పరిష్కార మార్గాలను వారే కనుగొనాలని వ్యాఖ్యానించారు.
















