భారత్తో వివాదాలకు ఆజ్యం పోస్తూ చైనాకు దగ్గరవుతున్న మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్జు మరోసారి తన నోటి దరుసు ప్రదర్శించారు. న్యూఢిల్లీపై మళ్లీ వ్యతిరేక గళం వినిపించారు. మే నెల 10వ తేదీ తర్వాత భారత్కు చెందిన మిలిటరీ సిబ్బంది ఒక్కరు కూడా తమ భూభాగంలో ఉండకూదని ఆర్డర్ వేశారు. ఆఖరికి సివిల్ డ్రెస్సుల్లో కూడా భారత మిలిటరీ సిబ్బంది ఇక్కడ సంచరించడానికి వీల్లేదంటూ మొయిజ్జు నోరు పారేసుకున్నారు. సైనిక సహకారంపై చైనాతో కీలక ఒప్పందం కుదుర్చుకున్న గంటల వ్యవధిలోనే మాల్దీవ్స్ అధ్యక్షుడు తన స్వరానికి పదును పెట్టడం గమనార్హం.
ఈ క్రమంలోనే మాల్దీవ్స్లోని మూడు వైమానిక స్థావరాల్లో విధులు నిర్వహిస్తున్న భారత బలగాలు వెనక్కి వెళ్లిపోవాలని గతంలోనే మొయిజ్జు ఆదేశించారు. ఒక వైమానిక స్థావరంలోని బలగాలు మార్చి 10లోగా, మిగతా రెండు స్థావరాల్లోని దళాలు మే 10 నాటికి వెనక్కి వెళ్లిపోవాలని ఆర్డర్ వేశారు. దానిపై ఫిబ్రవరి 2న ఢిల్లీ వేదిక గా ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. కాగా, మొయిజ్జు అధికారంలోకి వచ్చిన తర్వాత మాల్దీవ్స్, భారత్ దేశాల మధ్య దూరం పెరిగింది.