అసోసియేషన్ అఫ్ ఇండో అమెరికన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో తానా స్వర్ణోత్సవ శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తానా స్థాపించి 50వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా తానా కాలిఫోర్నియా నాయకులు, సంస్థ విశిష్టత, తానా కార్యక్రమాల గురించి తెలియజేసే ప్రత్యేక శకటాన్ని ప్రదర్శించారు.

ఈ కార్యక్రమంలో తానా ఫౌండేషన్ ట్రస్టీ భక్త బల్ల, తానా బోర్డు డైరెక్టర్ వెంకట్ కోగంటి, తానా ఎడ్యుకేషనల్ కోఆర్డినేటర్ వెంకట్రావు అడుసుమల్లి, నార్తర్న్ కాలిఫోర్నియా రీజినల్ కోఆర్డినేటర్ సుధీర్ ఉన్నం, సదరన్ కాలిఫోర్నియా కోఆర్డినేటర్ హేమకుమార్ గొట్టి, ప్రదీప్ కన్నా, శ్రీనివాస్ కొల్లి, వెంకట్ కొల్ల, భాస్కర్ వల్లభనేని, శ్రీకాంత్ దొడ్డపనేని, రామ్ మారం, రజని మారం, నేతాజీ గుర్రం, సందీప్ నాయుడు రథినా, ఆనంద్ పాల్గొన్నారు.

బే ఏరియా నివాసి ప్రదీప్ ఖన్నా సుపుత్రుడు అతిలూత్ కట్టు, అల్లూరి సీతారామరాజు వేషధారణలో ప్రతేక ఆకర్షణగా నిలిచాడు.ఈ కార్యక్రమానికి బే ఏరియాలోని 50కి పైగా భారతీయ సంస్థలు, 25 వేల మంది ప్రవాస భారతీయులు హాజరయ్యారు. శాన్ జోస్లోని వీధుల్లో 75 శకటాలతో భారీ పరేడ్ నిర్వహించారు. రంగు రంగుల శకటాల ప్రదర్శనతో శాన్ జోస్లో పండుగ వాతావరణం ఏర్పడింది.

దాదాపు 100 మందికి పైగా పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత, నృత్య, శాస్త్రీయ నృత్య కార్యక్రమాలలో పాల్గొన్నారు. జెండా వందనం కార్యక్రమంలో బాలీవుడ్ నటి అమీషా పటేల్ (గ్రాండ్ మార్షల్), ఎర్త్ క్లీన్స్ ఫౌండర్ శ్రీకాంత్ బొల్లా(గెస్ట్ ఆఫ్ ఆనర్), డిప్యూటీ కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా రాకేష్ అడ్లఖా (ఎస్ఎఫ్ఓ) పాల్గొన్నారు. భారత దేశంలోని అనేక రాష్ట్రాల సంస్కృతి, వారసత్వాలు ఉట్టిపడేలా అలంకరించిన అనేక శకటాలు పరేడ్లో అలరించాయి. భారతీయుల దేశభక్తికి సంబంధించిన పాటలు, సంగీతంతో శాన్ జోస్ నగరం మార్మోగింది.
















