Namaste NRI

యూఎస్‌ గోల్డ్‌కార్డ్‌ పై భారతీయుల ఆసక్తి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కొత్తగా ప్రకటించిన గోల్డ్‌ కార్డ్‌  పట్ల భారతీయులు ఆసక్తి చూపుతున్నారు. ప్రజాదరణ పొందిన నాన్‌ ఇమిగ్రెంట్‌ హెచ్‌-1బీ వీసా దరఖాస్తు రుసుమును 1 లక్ష డాలర్లకు పెంచిన నేపథ్యంలో ప్రత్యామ్నాయం కోసం భారతీయ ప్రతిభావంతులు చూస్తున్నారు. అమెరికా రెసిడెన్సీ పొందడానికి సత్వర మార్గమనే హామీని గోల్డ్‌ కార్డ్‌ ఇస్తుండటంతో భారతీయుల నుంచి విచారణలు 30-40 శాతం మేరకు పెరిగాయి. వీరిలో సంపన్నులు ఎక్కువగా ఉన్నారు. గోల్డ్‌ కార్డ్‌ జారీ కోసం ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై ట్రంప్‌ ఈ నెల 19న సంతకం చేశారు. 1 మిలియన్‌ డాలర్లు చెల్లించి ఈ కార్డును కొనుక్కోవచ్చు. సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథమెటిక్స్‌ నేపథ్యం గల మిడ్‌ కెరీర్‌ టెక్‌ ప్రొఫెషనల్స్‌ గోల్డ్‌ కార్డ్‌ పట్ల ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.

వ్యక్తిగతంగా 1 మిలియన్‌ డాలర్లు లేదా కార్పొరేట్‌ స్పాన్సర్‌షిప్‌ ద్వారా 2 మిలియన్‌ డాలర్లు అమెరికా ఖజానాకు బహుమతి గా ఇచ్చేవారికి గోల్డ్‌ కార్డు వస్తుంది. ఈ సొమ్మును తిరిగి చెల్లించరు. ఇది ఈబీ5 మాదిరిగా పెట్టుబడి ఆధారిత వీసా కాదు. ఈ సొమ్మును అమెరికన్‌ వాణిజ్య, పరిశ్రమలకు ఇచ్చే కంట్రిబ్యూషన్‌గా పరిగణిస్తారు. ఇప్పటికే 2.5 లక్షల మంది ఆసక్తి చూపుతున్నారని అమెరికా కామర్స్‌ సెక్రటరీ హోవార్డ్‌ లుట్నిక్‌ చెప్పారని సింఘానియా అండ్‌ కో మేనేజింగ్‌ పార్టనర్‌ రోహిత్‌ జైన్‌ తెలిపారు.

Social Share Spread Message

Latest News