ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ వారసత్వంపై ఆయన సోదరి, కుమార్తె మధ్య పోరాటం సాగవచ్చంటూ దక్షిణ కొరియాకు చెందిన నిఘా వ్యవస్థ నివేదిక వెల్లడించింది. కిమ్ జోంగ్ ఇటీవలి కాలంలో తన 13 ఏండ్ల కుమార్తె కిమ్ జూ ఏతో కలసి బహిరంగ వేదికలపై కనిపిస్తుండడంతో అధికార వారసత్వం ఆ బాలికకే దక్కవచ్చన్న ఊహాగానాలను రాజేసింది. అయితే కిమ్ జూ ఏకి అధికార పీఠం దక్కడం అంత సులభం కాదని దక్షిణ కొరియా మాజీ రాయబారి రా జోంగ్ ఇల్ అభిప్రాయపడ్డారు. ఆ బాలికకు పెను సవాలు తన మేనత్త కిమ్ యో యోంగ్ రూపంలో ఎదురు కావచ్చని ఆయన చెప్పారు. తన సోదరుడి లాగే ఆమె కూడా అత్యంత క్రూరమైన వ్యక్తిగా పేరు సంపాదించుకుంది.

38 ఏండ్ల కిమ్ యో జోంగ్ ఉత్తర కొరియాలో తన అన్న తర్వాత అత్యంత శక్తివంతమైన వ్యక్తి. పార్టీపైన, సైన్యంపైన ఆమెకు మంచి పట్టు ఉంది. పార్టీకి చెందిన 250 మంది కేంద్ర కమిటీ సభ్యుల్లో అధ్యక్షుడిని తప్ప ఎవరికైనా మరణశిక్షలు విధించగల శక్తి ఆమెకు ఉన్నట్లు తెలుస్తున్నది. కిమ్ యో జోంగ్ అధికార పీఠాన్ని వదులుకోబోరని నిపుణుల అభిప్రాయం. దేశాధినేత్రిగా తనకు అవకాశం ఉన్నట్లు ఆమె భావిస్తే ఆమె ఏమాత్రం వెనుకాడబోదని, దీన్ని బట్టి అధికారం కోసం పోరాటం అనివార్యమని భావించాలని రే జోంగ్ ఇల్ చెప్పారు. కిమ్ జోంగ్ ఉన్కు ఏదైనా జరగరానిది జరిగి ఆయన పాలించలేని పరిస్థితి వస్తే వెంటనే కిమ్ యో యోంగ్ అధికార పీఠాన్ని దక్కించుకోవడానికి ప్రయత్నించవచ్చని ఆయన చెప్పారు.















