
నటుడు కిరణ్ అబ్బవరం నటించిన క చిత్రానికి అరుదైన గౌరవం లభించింది. 15వ ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ సినిమా నామినేట్ అయ్యింది. ఉత్తమ చిత్ర విభాగానికి క నామినేట్ అయినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఢిల్లీ వేదికగా ఈ నెలాఖరున జరిగే వేడుకల్లో విజేతలు పురస్కారాలు అందుకోనున్నారు. నూతన దర్శకులు సుజిత్, సందీప్ దర్శకత్వంలో చింతా గోపాలకృష్ణరెడ్డి నిర్మించిన ఈ చిత్రం గత ఏడాది విడుదలై అఖండ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. నయన్ సారిక, తన్వీ రామ్ ఇందులో కథానాయికలు. ఫాంటసీ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రాన్ని డాల్బీ విజన్ ఆటమ్స్ టెక్నాలజీతో మేకర్స్ తెరకెక్కించారు. ఇదో విభిన్నమైన కథ. కర్మసిద్ధాంతం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. సగటు ప్రేక్షకునికి ఆద్యంతం సినిమా చూస్తే తప్ప అంతుచిక్కని స్క్రీన్ప్లేతో దర్శకులు సుజిత్, సందీప్ క ను మలిచారు. వాణిజ్య పరంగా 50కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. దీనికి కొనసాగింపు కూడా ఉంటుందని, తొలి పార్ట్ని మించేలా క -2 తెరకెక్కిస్తామని దర్శకులు చెబుతున్నారు.
