ట్రాఫిక్ ఉల్లంఘనలను అడ్డుకట్ట వేసేందుకు కువైత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్ జరిమానాలను భారీగా పెంచనున్నట్లు వెల్లడించింది. 4.6 మిలియన్ల జనాభా కలిగిన కువైత్లో గడిచిన పది నెలల్లో ఏకంగా 4.31లక్షల ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు కావడం గమనార్హం. రోజుకు సగటున 1,400 ఉల్లంఘనలు. అలాగే ఈ 10 నెలల వ్యవధిలో ట్రాఫిక్ ప్రమాదాల కారణంగా 165 మంది మరణించారు. ట్రాఫిక్ ఉల్లంఘనల తాలూకు కేసులు కూడా కోర్టులో అదే స్థాయిలో రావడం చర్చనీయాంశంగా మారింది.
ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు ఏకంగా 15,556 ట్రాఫిక్ కేసులు కోర్టుకు వచ్చాయి. ఈ కేసులకు గాను న్యాయస్థానం ఉల్లంఘనదారులకు ఏకంగా 2.50 లక్షల కువైటీ దినార్ల (రూ.6.76కోట్లు) జరిమానా విధించింది. కువైత్ అధికారులు డ్రైవింగ్ లైసెన్స్ల జారీ విషయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఇక ప్రవాసులు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే సంబంధిత అధికారులు ఏకంగా దేశం నుంచే బహిష్కరిస్తున్నారు.
గడిచిన ఆరు నెలల్లో 18వేల మందికి పైగా ప్రవాసులను దేశం నుంచి వెళ్లగొట్టింది కువైత్ సర్కార్. ఈ ఏడాది మార్చి నుండి ఆగస్టు వరకు వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన 18,486 మంది ప్రవాసులను దేశం నుంచి బహిష్కరించడం జరిగిందని ట్రాఫిక్ అవేర్నెస్ డిపార్ట్మెంట్ చీఫ్ నవాఫ్ అల్ హయాన్ చెప్పారు. అలాగే కువైత్ అధికారులు జనవరి-ఆగస్టు మధ్య కాలంలో ఏకంగా 34,751 మంది ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్స్లను క్యాన్సిల్ చేశారు.














