డాలస్లోని ఇర్వింగ్ నగరంలో నెలకొని ఉన్న అమెరికా దేశంలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద మహాత్మాగాంధీ 156వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ మహత్మా గాంధీ మెమోరియల్ను సందర్శించి జాతిపితకు పుష్పాంజలి ఘటించారు. సచిన్ వెంట వ్యాపారవేత్త అరుణ్ అగర్వాల్, కమ్యూనిటీ నాయకుడు సల్మాన్ ఫర్షోరి ఉన్నారు.


మహత్మా గాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డా.ప్రసాద్ తోటకూర సచిన్ను ఆహ్వానించి, ఈ మెమోరియల్ స్థాపన వెనుక ఉన్న కార్యవర్గ సభ్యుల శ్రమ, వేలాది ప్రవాస భారతీయుల సమష్టి కృషి, దాతల దాతృత్వం, అనుమతి ఇవ్వడంలో అధికారులు అందించిన సహకారం, దశమ వార్షికోత్సవాన్ని వివరించారు. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ గాంధీ జయంతి రోజున అమెరికాలో గాంధీ స్మారక స్థలిని సందర్శించి నివాళులర్పించడం తన అదృష్టమన్నారు. మహాత్మాగాంధీ జీవితంలో ప్రపంచంలో ఉన్న మానవాళి అంతటికీ నిత్య నూతన శాంతి సందేశం అన్నారు. ఎంతో ప్రశాంత వాతావరణంలో, సుందరంగా, పరిశుభ్రంగా గాంధీ స్మారకస్థలిని నిర్వహిస్తున్న గాంధీ మెమోరియల్ అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, కార్యవర్గ సభ్యులందరికీ ప్రత్యేక అభినందనలు అని పేర్కొన్నారు.


మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన గాంధీ శాంతి నడక`2025లో వందలాది ప్రవాస భారతీయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఉత్తరాధ్యక్షులు మహేంద్ర రావు అందరినీ ఆహ్వానించి సభను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా కాన్సల్ జనరల్ ఆఫ్ ఇండియా డీసీ మంజునాథ్, ప్రత్యేక అతిథులుగ సన్నీవేల్ మేయర్ సాజీ జార్జి, ఫ్రిస్కో నగర కౌన్సిల్ సభ్యుడు బర్ట్ ఠాకూర్, ఆంధ్రప్రదేశ్ హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ డా.దాసరి శ్రీనివాసులు, రిటైర్డ్ ఐఏఎస్ హాజరై జాతిపితకు పుష్పాంజలి ఘటించారు. మహాత్మాగాంధీ జీవితంలోని ఎన్నో ఘట్టాలను, ఆయన త్యాగ నీరతిని గుర్తు చేసుకున్నారు. మహాత్మాగాంధీ శాంతి సందేశానికి చిహ్నంగా 10 తెల్లటి కపోతాలను ఎగురవేసి అందరూ కలసి శాంతినడకలో పాల్గొన్నారు.

మురళి వెన్నం హాజరైన అతిథులకు, కార్యక్రమాన్ని విజయవంతంలో కృషి చేసిన కార్యకర్తలకు, అల్పాహారం అందించిన ఇండియా టుడే కెఫే అధినేత వినోద్ ఉప్పుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ వేడుకలలో ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ నాయకులు, రాజీవ్ కామత్, మహేంద్ర రావు, బీఎన్ రావు, జస్టిన్ వర్ఘీస్, షబ్నం మాడ్గిల్, దీపక్ కార్లా, డా.జేపీ, ముర్తుజా, కలై, ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్, మహాత్మాగాంధీ మెమోరియల్ నాయకులు డా.ప్రసాద తోటకూర, తైయాబ్ కుండావాలా, మురళి వెన్నం, రాంకీ చేబ్రోలు, వినోద్ ఉప్పు, అనంత్ మల్లవరపు, కమ్యూనిటీ నాయకులు చంద్ర పొట్టిపాటి, చినసత్యం వీర్నపు, లక్షి పాలేటి, సురేఖా కోయ, క్రాంతి ఉప్పు, చిన్ని పాల్గొన్నారు.
















