తెలుగు సినీచరిత్రలో మాయాబజార్ చిత్రం ఎవర్గ్రీన్ క్లాసిక్గా నిలిచిపోయింది. కెవీ రెడ్డి నిర్ధేశకత్వంలో ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావు, సావిత్రి, రేలంగి, గుమ్మడి, సూర్యకాంతం వంటి ప్రజ్ఞావంతులైన తారాగణం తో వెండితెరపై ఓ దృశ్యకావ్యంగా నిలిచిపోయింది. ఈ నెల 28న ఎన్టీరామారావు 102వ జయంతి సందర్భం గా ఈ చిత్రాన్ని సరికొత్త సాంకేతిక హంగులతో ముస్తాబు చేసి రీరిలీజ్ చేస్తున్నారు. బలుసు రామారావు ఈ రీరిలీజ్ వెర్షన్ను సిద్ధం చేశారు. ఈ సందర్భంగా ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

దీనికి ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఛైర్మన్ టీడీ జనార్ధన్, రమేష్ప్రసాద్, యస్వీ కృష్ణారెడ్డి, వీరశంకర్, అచ్చిరెడ్డి తదితరులు హాజరయ్యారు. 68 ఏళ్ల క్రితం విడుదలైన మాయాబజార్ నేటి తరాన్ని కూడా అలరిస్తుందని, గ్రాఫిక్స్లేని నాటి రోజుల్లోనే అద్భుతంగా తెరకెక్కించారని టీడీ జనార్ధన్ అన్నారు. ఈ చిత్రాన్ని ఐమాక్స్ బిగ్స్క్రీన్లో విడుదల చేయడం ఆనందంగా ఉందని రమేష్ ప్రసాద్ తెలిపారు. మాయాబజార్ చిత్రాన్ని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదని యస్వీకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
