అమెరికా అధ్యక్ష బరిలో నుంచి భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ తప్పుకున్నారు. రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిగా ట్రంప్తో పోటీపడిన ఆమె, రేసు నుంచి వైదొలుగుతున్నట్లుగా ప్రకటించారు. దీంతో రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి జో బైడెన్, డోనాల్డ్ ట్రంప్ తలపడనుండటం ఖాయమైపోయింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా జరుగుతున్న ప్రైమరీ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున డోనాల్డ్ ట్రంప్తో నిక్కీ హేలీ, వివేక్ రామస్వామితో పాటు చాలామందే పోటీపడ్డారు. కానీ ప్రైమరీ ఎన్నికలు మొదలైనప్పటి నుంచి మాజీ అధ్యక్షుడు ట్రంప్ టాప్లో కొనసాగుతూ వస్తున్నారు. దీంతో ఒకరి తర్వాత ఒకరు వైదొలగడంతో రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్నకు పోటీగా నిక్కీ హేలీ మాత్రమే మిగిలారు. ఈ క్రమంలో మార్చి 5వ తేదీన జరిగిన సూపర్ ట్యూజ్ డే రేసులో దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో ట్రంప్నే విజయం సాధించారు. ఒక్క వెర్మౌంట్ రాష్ట్రంలో మాత్రమే నిక్కీ హేలీ విజయం సాధించారు. దీంతో రిపబ్లికన్ పార్టీలో అధ్యక్ష అభ్యర్థిత్వానికి ఎంపిక కావాలంటే 1215 మంది ప్రతినిధుల మద్దతు కావాల్సి ఉండగా, ట్రంప్నకు 995 మంది మద్దతు లభించింది. నిక్కీ హేలీకి 89 మంది మద్దతు మాత్రమే ఉన్నారు. ఈ క్రమంలోనే సౌత్ కరోలినాలో ఏర్పాటు చేసిన కార్య క్రమంలో హేలీ మాట్లాడుతూ పోటీ నుంచి తప్పుకున్నట్లుగా ప్రకటించారు. తన క్యాంపెయిన్ నిలిపివేయా ల్సిన సమయం వచ్చిందని, దీనికి తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని ఈ సందర్భంగా నిక్కీ హేలీ తెలిపారు.