దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒడిశాలోని పూరీ జగన్నాథ స్వామి ఆలయం ఒకటి. ఆ ఆలయంలో జరిగే రథోత్సవం ఎంత ప్రసిద్ధో మనకు తెలసు. ఏటా నిర్వహించే ఈ ఆలయ రథోత్సవంలో లక్షల మంది భక్తులు పాల్గొంటారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఈ తరహాలోనే జగన్నాథ ఆలయాలను నిర్మించారు. బ్రిటన్ లో తొలి జగన్నాథ ఆలయ నిర్మాణం చేపడుతున్నారు. రూ. వందల కోట్ల వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నారు. లండన్ శివారులో నిర్మించే ఈ ఆలయం కోసం అక్కడి స్థానికులంతా కలిసి శ్రీ జగన్నాథ సొసైటీ యూకే (ఎస్జేఎస్యూకే) పేరిట ఓ సంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు.


దేశ వ్యాప్తంగా ప్రజల నుంచి ఈ సొసైటీ విరాళాలు సేకరిస్తోంది. ఈ నేపథ్యంలో ఒడిశాకు చెందిన బిశ్వనాథ్ పట్నాయక్ అనే ప్రవాస భారతీయుడు ఆలయ నిర్మాణానికి ఏకంగా రూ.250 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. విదేశాల్లో ఆలయ నిర్మాణానికి ఇంత పెద్దమొత్తంలో విరాళం ఇవ్వడం ఇదే తొలిసారి. శ్రీ జగన్నాథ సొసైటీ యూకే పేరుతో ఏర్పాటైన ఈ కమిటీ అక్షయ తృతీయ రోజున ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించింది. ఈ వేడుకకు బిశ్వనాథ్ను కూడా ఆహ్వానించారు. భూరి విరాళం సమర్పించిన బిశ్వనాథ్ పట్నాయక్ వృత్తి రీత్యా యూకేలో స్థిరపడ్డారు. లండన్లో ఫిన్నెస్ట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపక చైర్మన్గా ఆయన వ్యవహరిస్తున్నారు.















