బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రహమాన్ వచ్చే వారంలో ఇండియాలో పర్యటించాల్సి ఉంది. అయితే, ఈ పర్యటనపై బంగ్లాదేశ్ వైఖరి విచిత్రంగా ఉంది. తాము పెట్టిన రెండు షరతులకు అంగీకరిస్తేనే అనుకూల వాతావరణం ఏర్పడుతుందని, అప్పుడే ఆయన ఇండియాలో పర్యటిస్తారని బంగ్లాదేశ్ ప్రకటించింది. బంగ్లాదేశ్ ప్రధానిగా ఈ ఏడాది తారిక్ రహమాన్ ప్రమాణ స్వీకారం చేశారు. తొలిసారిగా ప్రధాని హోదాలో ఆయన ఇండియాలో పర్యటించాల్సి ఉంది.

ఈ మేరకు ఇండియా-బంగ్లాదేశ్ మధ్య చర్చలు జరిగాయి. ఆగష్టు 20-25 మధ్య తారిక్ రహమాన్ ఇండియాలో పర్యటిస్తారని సమాచారం. అయితే, ఈలోపే బంగ్లాదేశ్ ఒక మెలిక పెట్టింది. తమ రెండు షరతులకు అంగీకరిస్తేనే ఆయన ఇండియాలో పర్యటిస్తారని చెప్పింది. తమకు బంగ్లాదేశ్ ప్రయోజనాలే మొదటి ప్రాధాన్యమని, తమ షరతులకు అంగీకరిస్తేనే అనుకూల వాతావరణం ఏర్పడుతుందని బంగ్లాదేశ్ పేర్కొంది. రెండు షరతుల్లో మొదటిది బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాను ఆ దేశానికి అప్పగించడం. ఆమెతోపాటు ఇండియాలో ఆశ్రయం పొందుతున్న ఇతర బంగ్లా నేతల్ని కూడా అప్పగించాలని కోరుతోంది. రెండోది బంగ్లాదేశ్ ఉద్యమకారుడు షరీఫ్ ఒస్మాన్ హది హత్య ఘటనలో నిందితులు ఇండియాలోనే ఉన్నారని, వారిని కూడా అప్పగించాలని బంగ్లా డిమాండ్ చేస్తోంది.















