ఖతర్లో భారత రాష్ట్రసమితి వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. దోహాలో బీఆర్ఎస్ ఖతర్ అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్ అబ్బగౌని కేక్ కట్చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా 15 మంది బైక్ ఫుడ్ డెలివరీ బాయ్స్కు రూ.22 లక్షల ఉచిత జీవిత బీమా అందించారు. అనంతరం శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ గల్ఫ్కు వచ్చే యువత పెద్దసంఖ్యలో బైక్ ఫుడ్ డెలివరీ బాయ్స్గా చేరుతున్నారని వెల్లడించారు. కంపెనీల ఒత్తిడితో టార్గెట్ మించి డెలివరీలు చేస్తున్నారని, ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో వారికి తమవంతు సాయంగా 15 మంది బైక్ రైడర్లకు ఉచిత ప్రమాద బీమా చేయించామన్నారు.

ఖతర్లో అతి తక్కువ ప్రీమియంతో ఐసీబీఎఫ్ బీమా కంపెనీతో ఒప్పందం చేసుకున్నామని, రూ.22 లక్షల కవరేజీ ఉన్న జీవిత, ప్రమాద బీమా అందిస్తున్నామని చెప్పారు. మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా 15 మంది తెలంగాణ బైక్ రైడర్లలకు బీమా చేయించామన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఖతర్ సీనియర్ నాయకులు ఎల్లయ్య తాళ్లపెళ్లి, రాజిరెడ్డి మాసం, గంగ కిషన్, నరేశ్ పిప్పిరి, శేఖర్ అల్లకొండ, పర్వేజ్, సుభాన్, గడ్డి రాజు, అరుణ్ అలిశెట్టి, సాగర్, ప్రవీణ్ మోతే, హఫీజ్ మొహమ్మద్, సంజీవ్ థామస్ పాల్గొన్నారు.
