అరేబియన్ దేశాల్లో ఒకటైన యెమెన్ రాజధాని సనాలో విషాదం చోటుచేసుకున్నది. ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ సందర్భంగా సనాలోని బాల్ అల్-యెమెన్ ప్రాంతంలో ఓ స్వచ్ఛంద సంస్థ ప్రజలకు ఆర్థిక సాయం అందిస్తున్నది. దీంతో ఆర్థిక సాయం కోసం ప్రజలు పెద్దసంఖ్యలో ఎగబడ్డారు. ఈ సందర్భంగా ఒకరినొకరు తోసుకోవడంతో అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది. అదికాస్త తొక్కిసలాటకు దారితీయడంతో 85 మందికిపైగా మరణించారు. వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని హుతి సెక్యూరిటీ ఆఫీసర్ ఒకరు తెలిపారు. ఈ ప్రమాదంలో 322 మందికిపైగా గాయపడ్డారని, వారందరిని సమీపంలోని దవాఖానలకు తరించామన్నారు. నిర్వాహకుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.


పెద్దసంఖ్యలో జనాలు ప్రాణాలు కోల్పోవడంతో వారి సంబంధీకులు భారీగా అక్కడికి చేరుకున్నారు. దీంతో సైన్యం ఆ ప్రాంతాన్ని తమ ఆదీనంలోకి తీసుకున్నదని చెప్పారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. కాగా, మృతుల సంఖ్యపై ఇంకా స్పష్టత రాలేదని హుతి అంతర్గత వ్యవహారాల మంత్రి వెల్లడించారు. కొందరు వ్యాపారులు ప్రజలకు ఆర్థిక సాయం చేయడానికి ఈ కార్యక్రామన్ని ఏర్పాటు చేశారన్నారు.
