అమెరికా రాజధాని ప్రాంతం వేదికగా స్వర్ణోత్సవ సంస్థ, బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (జిడబ్ల్యుటిసిఎస్) ఆధ్వర్యంలో పికెల్ బాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్ను దిగ్విజయంగా నిర్వహించామని ఆ సంఘం అధ్యక్షులు రవి అడుసుమిల్లి వెల్లడించారు. ఈ టోర్నమెంట్లో అన్ని వయస్సు వారు వందలాది మంది క్రీడాకారులు పాల్గొన్నారు. దైనందిన జీవితంలో క్రీడలు ముఖ్య భాగమని, అందుకే ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన పికెల్ బాల్ క్రీడల పోటీని తొలిసారిగా నిర్వహించామని పేర్కొన్నారు.


తానా, ఆటా కార్యవర్గ సభ్యులు ఈ టోర్నమెంట్కు ముఖ్య అతిధులుగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఆదిత్య, శశాంక్ ప్రధమ, తరిధ్, అర్ష్ ద్వితీయ స్థానాల్లో విజేతలుగా నిలిచి బహుమతులు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ, దాతలు, మీడియా వారికి, అలాగే ఈ కార్యక్రమ సమన్వయకర్తలు రాజేష్ కాసారనేని, సుశాంత్ మన్నే, శివాజీ మేడికొండ, విజయ్ అట్లూరి, శ్రీధర్ వాసిరెడ్డి, దుర్గా కొడాలిలకు ఈ సంస్థ అధ్యక్షులు రవి అడుసుమిల్లి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేశారు. అలాగే యువత కోసం సంస్కృతీ, భాష వేదికగా మరిన్ని కార్యక్రమాలతో ఈ ఒరవడిని కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
















