తెలంగాణ సాధించిన జల విజయగాథలను ప్రపంచ వేదికపై చాటేందుకు తెలంగాణ పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో నిర్మాణమైన ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టు, ఇంటింటికీ సురక్షిత మంచినీరు అందిస్తున్న మిషన్ భగీరథ ప్రాజెక్టు సాధించిన విజయాలను వివరించనున్నారు. అమెరికాలోని నెవడా రాష్ట్రం హెండర్సన్ నగరంలో జరుగుతున్న అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్ (ఏఎస్సీఈ)- వరల్డ్ ఎన్విరాన్మెంటల్ అండ్ వాటర్ రిసోర్సెస్ కాంగ్రెస్ సదస్సులో మంత్రి కేటీఆర్ ప్రారంభోపన్యాసం చేయనున్నారు.
అమెరికాలోని దాదాపు అన్ని ప్రాంతాల నుంచి హాజరయ్యే సివిల్ ఇంజినీర్ల సమక్షంలో మంత్రి కేటీఆర్ సాగునీటి రంగంలో తెలంగాణ సాధించిన విజయాలను వివరించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, దాని ద్వారా అందుతున్న ఫలాలు, ఇతర ప్రణాళికలపై కేటీఆర్ పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టుల ద్వారా తెలంగాణలో వచ్చిన సామాజిక, ఆర్థిక ప్రగతిని వివరించనున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో సాగునీటి రంగంలో సాధించిన విజయాలను ప్రపంచ వేదికపై వివరించే అవకాశం దకడం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు. అమెరికా పర్యటనలో భాగంగా ఐదు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో పలు కంపెనీలతో మంత్రి కేటీఆర్ సమావేశం అవుతారు. ఈ నెల చివరి వారం వరకు కొనసాగే పర్యటనలో భాగంగా పలు అమెరికన్ కంపెనీలు తమ పెట్టుబడులు ప్రకటించే అవకాశం ఉన్నది.