అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల హడావుడి మొదలైంది. ఎన్నికల కోసం ముమ్మరంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ప్రధాన పోలింగ్కు ముందు ముందస్తు ఓటింగ్ ప్రక్రియ ఊపందుకుంది. ఇప్పటి వరకూ దాదాపు ఆరు కోట్ల మంది అమెరికన్లు ముందస్తు ఓటింగ్ ప్రక్రియ ద్వారా ఓటేసినట్లు తెలిసింది. ఇందులో కొందరు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయగా, మరికొందరు మెయిల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసినట్లు సమాచారం. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఇటీవలే తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. డెలావేర్లోని విల్మింగ్టన్లో గత ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. దాదాపు 40 నిమిషాల పాటు క్యూలో నిల్చొని ఓటు వేసినట్లు యూఎస్ మీడియా తెలిపింది.
కాగా, యూఎస్ అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5న జరగనున్నాయి. డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బరిలోకి దిగారు. ఇరువురూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. గెలుపే లక్ష్యంగా ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు.