తెలంగాణ గ్రామీణ నేపథ్య కథతో రూపొందిస్తున్న యూత్ఫుల్ చిత్రం మేమ్ ఫేమస్. స్వీయ దర్శకత్వంలో సుమంత్ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు. ఛాయ్ బిస్కెట్, లహరి ఫిల్మ్స్ పతాకాలపై శరత్చంద్ర, అనురాగ్రెడ్డి, చంద్రు మనోహర్ నిర్మించారు. ఈ సినిమాలో 35 మంది నూతన తారాగణం నటించారు. ఈ సందర్భంగా సినిమా టీజర్, పాటల్ని ప్రదర్శించారు. ఈ సమావేశంలో చిత్ర దర్శకుడు, హీరో సుమంత్ప్రభాస్ మాట్లాడుతూ తెలంగాణ పల్లెటూరిలో నడిచే కథ ఇది. అక్కడి యువకుల బృందం ఓ లక్ష్యం కోసం ఏం చేశారన్నది ఆసక్తికరంగా ఉంటుంది. ప్రేమ, వినోదం, ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఆకట్టుకుంటుంది. కథానుగుణంగా ముప్పై మంది కొత్తవారిని తీసుకున్నాం. ఈ సినిమా మొత్తం తెలంగాణ మటన్ దావత్లా ప్రేక్షకుల్లో జోష్ను నింపుతుంది అన్నారు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు మస్తు మజా చేస్తారని, భారీ స్థాయిలో చిత్రాన్ని విడుదల చేయబోతున్నామని నిర్మాతలు తెలిపారు. లహరి ఫిలింస్ చంద్రు మనోహర్ మాట్లాడుతూ, 30మందికిపైగా నటీనటులను పరిచయం చేయడం గర్వంగా వుంది. దర్శకుడు బాగా చేశాడని అన్నారు. ఈ నెల 26న విడుదలకానుంది.
ఈ కార్యక్రమంలో నిర్మాతలు అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్, సంగీత దర్శకుడు కళ్యాణ్ నాయక్, కెమెరామెన్ శ్యామ్, ఎడిటర్ సృజన, సౌండ్ డిజైనర్ నాగార్జున, ఎగ్జిక్యూటివ్ నిర్మాత సూర్య చౌదరి, నటీనటులు మణి, మౌర్య చౌదరి, కిరణ్ మచ్చ, అంజిమామ, నరేంద్ర రవి, మురళీధర్ గౌడ్, శివనందన్, సిరిరాశి, సార్య, రచయిత, దర్శకత్వం సుమంత్ ప్రభాస్ హాజరయ్యారు.