Namaste NRI

సింగపూర్‌లో తెలుగు నీతి పద్యాల పోటీ

పిల్లలు మాతృభాషను మర్చిపోకూడదనే సంకల్పంతో, భాషకు ఆయువుపట్టు అయిన వేమన, సుమతీ శతకాల నీతి పద్యాల ద్వారా భాషపై అవగాహన పెంచడానికి సింగపూర్‌ తెలుగు టీవీ వారు సిద్ధమయ్యారు. సింగపూర్‌ తెలుగు తోరణము అనే పేరుతో వేమన, సుమతీ శతకాల నీతి పద్యాల పోటీని మొత్తం నాలుగు వృత్తాలుగా పది ఎపిసోడ్లుగా నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా మొదటి వృత్తంలోని నాలుగు భాగాలను గత వారం సింగపూర్‌ సివిల్ సర్వీస్ క్లబ్ నందు నిర్వహించారు. 20 మంది చిన్నారులు పాల్గొని నీతి పద్యాలను చెప్పి భావాన్ని అర్ధవంతంగా వివరించారు.

సింగపూర్‌లో మొట్టమొదటి తెలుగు రియాలిటీ షోగా ఈ కార్యక్రమం తెలుగు భాషాభివృద్దికి ఒక మంచి ప్రయత్నంలా, ఒక ముందడుగులా ఉంటుందని కార్యక్రమానికి విచ్చేసిన పలువురు తెలుగు ప్రముఖులు ప్రశంసించారు.  సింగపూర్‌ తెలుగు టీవీ వ్యవస్థాపకులు రాధాకృష్ణ గణేశ్న, కాత్యాయనీ గణేశ్న మాట్లాడుతూ తెలుగు భాషపై ఉన్న ఎనలేని మమకారమే ఇంతటి ప్రయత్నానికి తమను పురికొల్పిందని అన్నారు. ఈ నీతి పద్యాల పోటీ ఏదో ఒక చిన్న పోటీలా కాకుండా, తెలుగు రియాలిటీ షోలకు ఏమాత్రం తీసిపోని విధంగా సింగపూరు తెలుగు ఖ్యాతిని పెంచేలా ప్రయత్నం చేసామని, దానికి సహాయ సహకారాలు అందించిన అందరికీ కృతజ్ఞతలు అని తెలియచేసారు.

రాంబాబు పాతూరి, గాడేపల్లి అపర్ణ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. శ్రీ సాంస్కృతికి కళా సారధి అధ్యక్షుడు కవుటూరు రత్న కుమార్, తెలంగాణా కల్చరల్ సొసైటీ అధ్యక్షుడు రమేష్ గడప, తాస్ అధ్యక్షుడు అనితా రెడ్డి, సింగపూర్‌ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు జ్యోతేశ్వర రెడ్డి ముఖ్య అతిథిలుగా హాజరుకాగా రాధిక, సౌజన్య, శ్రీకాంత్, మాధవి అతిథులుగా హాజరయ్యారు. సుబ్బు వి. పాలకుర్తి, కవిత కుందుర్తి వ్యవహరించగా సాంకేతిక సహకారం శ్రీ రాం, చంద్రు, రజనీకాంత్ అందించారు. వేదిక పర్యవేక్షణ కళ్యాణ్ చక్రవర్తి నిర్వహించారు. ఈ కార్యక్రమం సింగపూర్‌ తెలుగు టీవీ యూట్యూబ్ చానల్ ద్వారా ప్రతి శనివారం ఒక భాగంగా మొత్తం 10 భాగాలుగా విడుదల అవుతుందని నిర్వాహకులు తెలిపారు.

Social Share Spread Message

Latest News