దక్షిణార్ధగోళములో అతి పెద్ద హిందూ ఆలయం, సాంస్కృతిక సముదాయం దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా జరిగిన ఉత్సవంలో పాల్గొనేందుకు వందలాది మంది హిందూ భక్తులు హాజరయ్యారు. దక్షిణాఫ్రికా జనాభాలో హిందువులు కేవలం రెండు శాతం మాత్రమే ఉన్నప్పటికీ దేశంలోని భారతీయ సమాజంలో అత్యధికులు హిందూ మతాన్నే అనుసరిస్తారు. 82 ఏళ్ల ఆధ్యాత్మిక నాయకుడు, బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ(బాప్స్)కు చెందిన మహంత్ స్వామి మహారాజ్ నేతృత్వంలో జరిగిన ఆలయ ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తెల్లవారుజామునే ఆలయానికి చేరుకున్నారు. దక్షిణార్ధగోళములోనే ఈ ఆలయం అతి పెద్ద హిందూ సాంస్కృతిక సముదాయంగా బాప్స్ తన ఫేస్బుక్ పేజ్లో అభివర్ణించింది.