పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్పై భారత్ కఠిన చర్యలకు దిగింది. ఈ క్రమంలో పాకిస్థాన్ పౌరులకు వీసా సేవల్ని నిలిపివేసింది. మెడికల్ వీసా సహా పాక్ జాతీయులకు జారీ చేసిన అన్ని వీసాలను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే వీసా పొందిన వారికి ఏప్రిల్ 27 వరకు గడువు ఇచ్చింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. అయితే, మెడికల్ వీసాలపై ఉన్న వారికి మాత్రం కొంత వెసులుబాటు కల్పించింది. ఈ నెల 29 వరకూ వారికి సమయం ఇచ్చింది. వీసా గడువు ముగిసేలోపు భారత్ను వీడాలని స్పష్టం చేసింది.

పాకిస్థాన్ పౌరులకు వీసా సేవల్ని నిలిపివేశాం. పాకిస్థాన్ జాతీయులకు భారత్ జారీ చేసిన అన్ని వీసాలను రద్దు చేశాం. ఇప్పటికే జారీ చేసిన వీసాలు ఏప్రిల్ 27 వరకూ చెల్లుబాటు అవుతాయి. మెడికల్ వీసాలు మాత్రం 29 వరకు చెల్లుబాటు అవుతాయి. భారత్లో ఉన్న పాక్ జాతీయులు వీసా గడువు ముగిసేలోపు దేశాన్ని వీడి మీ దేశాలకు వెళ్లిపోవాలి అని విదేశాంగ శాఖ ప్రకటనలో పేర్కొంది. ఇదే సందర్భంగా భారత పౌరులకు కేంద్రం కీలక హెచ్చరికలు చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయులెవరూ పాకిస్థాన్కు ప్రయాణించొద్దని పేర్కొంది. ఇప్పటికే పొరుగు దేశంలో ఉన్నవారు వెంటనే ఆ దేశాన్ని వీడి భారత్కు రావాలని ఆదేశించింది.
