తెలంగాణ ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ సభాపక్ష నేత రేవంత్ రెడ్డి రేపు (గురువారం) మధ్యాహ్నం 1.04 గంటలకు ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే సభలో 6 గ్యారెంటీ ల అమలుపై తొలి సంతకం చేయనున్నారు. ఈ 6 గ్యారెంటీలు ఎప్పటి నుంచి అమలు కానున్నాయో సభా వేదికపై ఆయన ప్రకటించనున్నారు.తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకావాలని ఏఐసీసీ నేతలకు, ఇతర రాష్ట్రాల నేతలకు రేవంత్ రెడ్డి ఆహ్వానం పలికారు. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక, ఏఐసీసీ నేతలను ఆహ్వానించారు.
కర్ణాటక సీఎం సిద్దిరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఆ రాష్ట్ర మంత్రులను కూడా ఆహ్వానించారు. రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లట్, ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘెల్, మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చౌహన్, గతంలో ఇంచార్జిలుగా పనిచేసిన దిగ్విజయ్ సింగ్, వీరప్పమొయిలీ, కుంతియా, వాయిలార్ రవి, మాణిక్కం ఠాగూర్, మరికొందరు ముఖ్యులను రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.
తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన చిదంబరం, మీరాకుమారి, సుశీల్ కుమార్ షిండే, కురియన్, మరికొందరు నేతలను రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. తెలంగాణ అమరుల కుటుంబాలను కూడా పిలిచారు. కోదండరామ్, గాదె ఇన్నయ్య, హరగోపాల్, కంచ ఐలయ్యలతోపాటు మరికొందరు ఉద్యమ కారులు, రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల అధినేతలను ఆహ్వానించారు. మాజీ సీఎం కేసీఆర్, తమిళనాడు సీఎం స్టాలిన్, ఏపీ సీఎం జగన్ తోపాటు మాజీ సీఎం చంద్రబాబు, సినీ నటులను పిలిచారు. హైకోర్టు చీఫ్ జస్టిస్తో పాటు వివిధ కుల సంఘాల నేతలు, మేధావులను రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.














