అమెరికా-కెనడా సరిహద్దుల్లో ఉన్న నయాగరా జలపాతం సమీపంలో భారీ పేలుడు సంభవించింది. దీంతో అధికారులు సరిహద్దులను మూసివేశారు. నయాగరా జలపాతం సమీపంలోని రెయిన్ బ్రిడ్జి వద్ద ఓ కారులో పేలుడు చోటుచేసుకున్నది. పేలుడు దాటికి కారు ఒక్కసారిగా గాలిలోకి ఎగిరిపోయింది. కారు బాంబు దాడిలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. అయితే ఈ బ్రిడ్జి రెండు దేశాల సరిహద్దుల్లో ఉండటంతో అధికారులు సరిహద్దులను మూసివేశారు. నయాగరా జలపాతానికి పర్యాటకుల రాకపై ఆంక్షలు విధించారు. అదేవిధంగా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇరు దేశాల మధ్య ఉన్న మరో మూడు బ్రిడ్జిలను కూడా బంద్ చేశారు.

యూఎస్-కెనడా సరిహద్దును దాటుతుండగా ఈ బాంబు పేలుడు సంభవించిందని నయాగరా ఫాల్స్ మేయర్ కార్యాలయం వెల్లడించింది. ఇరు దేశాలను అనుసంధానం చేసే సరిహద్దు వంతెనకు సంబంధించిన విషయం కావడంతో ఎఫ్బీఐ జాయింట్ టెర్రరిజమ్ టాస్క్ఫోర్స్ దర్యాప్తు చేస్తున్నదని న్యూయార్క్ గవర్నర్ క్యాథీ హోచుల్ తెలిపారు. అయితే ఈ పేలుడు వెనుక ఎలాంటి ఉగ్రవాద చర్య లేదని తెలుస్తున్నదని వెల్లడించారు. దానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు.

