Namaste NRI

కీలక నిందితుడిని భారత్ కు అప్పగించేందుకు.. అమెరికా సుప్రీం ఓకే

ముంబైలో 2008లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి కీలక నిందితుడిని భారత్ కు అప్పగించేందుకు అమెరికా సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది.  16 ఏళ్ల క్రితం మహా నగరంలో జరిగిన మారణహోమాన్ని తలుచుకుంటే దేశ ప్రజలకు ఇప్పటికీ వణుకు పడుతుంది. నాటి ఘటనలో దోషిగా తేలిన తహవూర్‌ రాణాను అమెరికా నుంచి భారత్‌కు అప్పగించేందుకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. అతడిని భారత్‌కు అప్పగించేందుకు అమెరికా సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ కేసులో తహవూర్‌ రాణా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది.

64 ఏళ్ల తహవూర్‌ రాణా పాకిస్థాన్‌ మూలాలతో ఉన్న కెనడా పౌరుడు. 26/11 ముంబయి ఉగ్రదాడుల్లో కీలక సూత్రధారి గా అతడిని గుర్తించారు. ప్రస్తుతం రాణా లాస్‌ ఏంజెల్స్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అతడిని భారత్‌కు అప్పగించా లని భారత్‌ గత కొంతకాలంగా అమెరికాను కోరుతోంది. భారత ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి అమెరికా గతంలోనే సానుకూలంగా స్పందించింది. ఇక అతడి అప్పగింత విషయమైన భారత్‌ న్యాయస్థానాల్లో పోరాడుతోంది. ఈ క్రమం లో భారత్‌ ప్రయత్నాలను తహవూర్‌ పలు ఫెడరల్‌ కోర్టుల్లో సవాల్‌ చేశాడు. తనను భారత్‌కు అప్పగించొద్దంటూ పిటిషన్‌లు వేశాడు. అయితే, రాణా చేసిన పిటిషన్లు అమెరికా ఫెడరల్‌ కోర్టులు తిరస్కరిస్తూ వచ్చాయి. దీంతో అతడు చివరి ప్రయత్నంగా గతేడాది అమెరికా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.

ఈ మేరకు పిటిషన్‌ దాఖలు చేశాడు. అతడి పిటిషన్‌పై అమెరికా సుప్రీంకోర్టు విచారణ జరిపింది. విచారణ సందర్భం గా అతడి పిటిషన్‌ను కొట్టివేయాలని అమెరికా ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు అఫిడవిట్‌ దాఖలు చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌ను పరిశీలించిన సుప్రీంకోర్టు.. రాణా అభ్యర్థనను తిరస్కరించింది. సుప్రీం తీర్పుతో న్యాయపరమైన ప్రక్రియ పూర్తైన తర్వాత అతడిని భారత్‌కు అప్పగించే అవకాశాలు ఉన్నాయి.

Social Share Spread Message

Latest News