బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెంటే మేమంతా ఉంటామని ఎన్నారై బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల తరువాత వివిధ దేశాలకు చెందిన ఎన్నారై బీఆర్ఎస్ నాయకులు ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్లో కేసీఆర్ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాజీ ఎప్డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ మేమంతా ఉద్యమ సమయం నుంచి మీ వెంటే ఉన్నామని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీ వెంటే ఉంటూ మీ నాయకత్వంలో ముందుకు వెళ్తామని తెలిపినట్టు తెలిపారు. ఒక ఎన్నారైగా పార్టీకి సేవలందించిన నాకు ఎలాంటి రాజకీయ అండ లేకపోయినా అత్యుత్తమ రాష్ట్ర కార్పొరేషన్ పదివి ఇచ్చి గౌరవించినందుకు కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన నిలబడి పార్టీ పిలుపునిచ్చిన అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటామని యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ తెలిపారు. ఈ సమావేశంలో వివిధ దేశాలకు చెందిన ఎన్నారై బీఆర్ఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు.