Namaste NRI

భారత్‌ చెప్పింది నిజమే..  పాకిస్థాన్‌

తాను మధ్యవర్తిత్వం వహించి భారత్‌-పాకిస్థాన్‌ మధ్య యుద్ధాన్ని ఆపానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గత కొంత కాలంగా ప్రచారం చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ట్రంప్‌ ప్రచారంపై భారత్‌ ఎప్పటికప్పుడు స్పష్టతనిస్తోంది. పాక్‌తో ఉద్రిక్తతల విషయంలో మూడో వ్యక్తి ప్రమేయం లేదంటూ స్పష్టం చేస్తూ వస్తోంది. అయినప్పటికీ ట్రంప్‌ మాత్రం ఆ క్రెడిట్‌ తనదేనంటూ చెప్పుకుంటూ తిరుగుతున్నారు. అయితే, ట్రంప్‌ ప్రచారంలో వాస్తవం లేదని ఇప్పుడు తేలిపోయింది. ఈ విషయాన్ని పాక్‌ మంత్రి స్వయంగా చెప్పడం హాట్‌టాపిక్‌గా మారింది.

పాక్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్‌ దార్‌ మాట్లాడుతూ ఇటీవలే జరిగిన ఆపరేషన్ సిందూర్ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై ఇషాక్ దార్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య సమస్యల పరిష్కారానికి భారత్‌ ఎప్పుడూ మూడో పక్షం మధ్యవర్తిత్వాన్ని అంగీకరించలేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని అమెరికా మంత్రి మార్కో రూబియో తనకు చెప్పినట్లు తెలిపారు. యుద్ధ నివారణ కోసం భారత్‌తో ఏ విధమైన చర్చలు జరిగాయి అని నేను అమెరికా మంత్రి మార్కో రూబియోను ప్రశ్నించాను. అందుకు ఆయన, ఈ వివాదంలో ఏ మూడో దేశం జోక్యాన్నైనా భారత్ కోరుకోలేదని చెప్పారు. దీనిని పూర్తిగా ద్వైపాక్షిక అంశంగానే పరిగణించిందని రూబియో స్పష్టం చేశారు అని ఇషాక్‌ దార్ పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలతో ట్రంప్‌ ప్రచారంలో వాస్తవం లేదని మరోసారి స్పష్టమైంది.

Social Share Spread Message

Latest News