అమెరికాకు, వందేభారత్ రైళ్ల ప్రారంభోత్సవానికి వెళ్లే ప్రధానమంత్రి నరేంద్రమోదీ హింసాకాండతో అట్టుడుకుతున్న మణిపూర్కు ఎందుకు వెళ్లడం లేదని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్సీసీ) అధ్యక్షుడు కేఎస్ అళగిరిర ప్రశ్నించారు. ఢిల్లీ నుంచి చెన్నైకి వచ్చిన ఆయన విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ రైళ్లను స్టేషన్ మాస్టర్ కూడా జెండా ఊపి ప్రారంభించవచ్చని ఎద్దేవా చేశారు. కానీ, ప్రధానమంత్రి ప్రారంభించాల్సిన అవసరం లేదన్నారు. విదేశాలకు వెళ్లే ప్రధానికి దేశంలోని ఓ రాష్ట్రంలో జరుగుతున్న హింసాకాండ కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. బాధితులకు ధైర్యం కల్పించేలా, శాంతియుత వాతావరణం తీసుకొచ్చేలా ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మణిపూర్ వెళ్లనున్నారని అళగిరి తెలిపారు.


