జగదీశ్ ఆమంచి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా యముడు. ధర్మో రక్షతి రక్షితః అనేది ఉప శీర్షిక. ఇందులో శ్రావణి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ వచ్చాయి. తాజాగా యముడు మూవీ ఆడియో లాంచ్ వేడుకను మేకర్స్ నిర్వహించారు. ఇందులోని పాటలను ప్రముఖ నిర్మాత బెక్కెం వేణు తో పాటు ప్రియాంక, మల్లిక విడుదల చేశారు. ఈ సందర్భంగా బెక్కెం వేణు మాట్లాడుతూ ఇవాళ యేడాదికి వందల చిత్రాలు వస్తున్నాయి. అయితే కొందరికే విజయం దక్కుతోంది. అయితే చిన్న సినిమాలు ఈ మధ్య కాలంలో వండర్స్ క్రియేట్ చేస్తున్నాయి. యముడు సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

జగదీశ్ ఆమంచి మాట్లాడుతూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి, సినిమా మీద మక్కువతో ఇండస్ట్రీలోకి వచ్చి, ఈ రోజు యముడు సినిమాతో ఇక్కడి వరకు వచ్చాను. ప్రస్తుతం ఎక్కడ చూసినా కుట్రలు, కుతంత్రాలు, హత్యలు, అక్రమ సంబంధాలకు సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి. ఆ పాయింట్స్ తోనే ఈ చిత్రాన్ని తీశాం. అందరినీ ఆకట్టుకునేలా మా చిత్రం ఉంటుంది అని అన్నారు. ఈ సినిమా తమకు మంచి గుర్తింపు తెచ్చిపెడుతుందనే ఆశాభావాన్ని శ్రీమల్లిక, శ్రావణి శెట్టి వ్యక్తం చేశారు. ఈ చిత్రంలోని పాటలు అందరినీ ఆకట్టుకుంటాయని సంగీత దర్శకులు భవానీ రాకేశ్ అన్నారు. ఈ కార్యక్రమంలో స్క్రీన్ ప్లే రైటర్ శివ, సినిమాటోగ్రాఫర్ విష్ణు కూడా పాల్గొన్నారు.















