అమెరికా లోని డల్లాస్ నగరంలో మహాత్మా గాంధీ స్మారకం వద్ద భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ‘హర్ ఘర్ తిరంగా’ నినాదంతో మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ కార్యదర్శి రావు కల్వల స్వాగత శుభాకాంక్షలతో వేడుకలు ప్రారంభించారు. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. తోటకూర ప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహాత్మాగాంధీ, నెహ్రూ, నేతాజి, వల్లభాయ్ పటేల్, వీర్ సావర్కర్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, భగత్ సింగ్ వంటి సమర యోధులను వారి త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ఇర్వింగ్ నగర మేయర్ యల్ జపంటా మాట్లాడుతూ రెండు ప్రజాస్వామ్య దేశాలైన అమెరికా భారత్ మద్య దృఢమైన సంబంధాలు నెలకోల్పడానికి ప్రవాస భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. భారత జాతీయ గీతం తో పాటు అమెరికా జాతీయ గీతం కూడా ఆలపించడం బాగుందని అన్నారు.


ఆత్మీయ అతిధిగా హాజరైన ప్రముఖ కవి సినీ గేయ రచయిత జొన్న విత్తుల రామలింగేశ్వర్రావు త్రివర్న పతాకంపై పద్యము శ్రావ్యం గా వినిపించారు. ప్రత్యేక అతిథిగా హాజరైన ప్రముఖ సంఘ సేవకులు వామరాజు సత్య మూర్తి ప్రవాస భారతీయులందరికీ 80 వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో దేశ రక్షణలో సైనికులుగా సేవలు అందించి అమెరికాలో స్థిరపడ్డ కల్నల్ రకేష్ శర్మ, కల్నల్ హర విందర్ బింద్రాలను , కొలంబియా నిర్వహించిన చెస్ పోటీల్లో సత్తాచాటిన సరయు తలపనేని లను ఇర్వింగ్ నగర మేయర్ యల్ జపంటా, డా. తోటకూర ప్రసాద్ , ఇతర అతిదులు ఘనంగా సన్మానించారు. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ కో చైర్మన్ తాయబ్ కుండావాలా, కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ , చిన సత్యం వీర్నపు, సేవలను కొనియాడారు. బోర్డు సభ్యులు కలై, మురళి వెన్నము, రాజేంద్ర వంకావాల, మూర్తుజ, తిరుమల్ రెడ్డి, అనంత మల్లవరపు , తో పాటు యంవిల్ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డా. అరవింద్ రావు, ప్రవాస భారతీయులు ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ఇండియా టుడే రెస్టారెంట్ వారు అందరికీ అల్పాహారం అందజేశారు.

















