యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజధాని అబుదాబిలో జరిగిన డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు, ఒక పాకిస్థాన్ జాతీయుడు మరణించారు. ఈ ఘటనలో ఆరుగురు గాయపడినట్లు అబుదాబి పోలీసులు తెలిపారు. అబుదాబిలోని ఒక ఆయిల్ ఫీల్డ్లో మూడు ఆయిల్ ట్యాంకర్ల వద్ద, అంతర్జాతీయ విమానాశ్రయంలో పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనల్లో ముగ్గరు చనిపోయినట్లు అబుదాబి పోలీసులు నిర్ధారించారు. ఇద్దరు భారతీయులు, ఒక పాకిస్థానీ మరణించినట్లుగా గుర్తించారు. మరో ఆరుగురు గాయపడినట్లు వెల్లడిరచారు. డ్రోన్లకు చెందిన చిన్న ఎగిరే వస్తువులను ప్రాథమిక దర్యాప్తులో గుర్తించినట్లు అబుదాబి పోలీసులు తెలిపారు. అవి రెండు ప్రాంతాల్లో పడటంతో పేలుడు, మంటలకు కారణమై ఉండవచ్చని తెలిపారు. ఈ ఘటనల వల్ల పెద్దగా నష్టం ఏమీ జరుగలేదన్నారు. దీనిపై దర్యాప్తు జరుపుగుతున్నదని తెలిపారు. ఘటన స్థలంలో చిన్న విమానానికి సంబంధించిన భాగాలు కనిపించాయని, రెండు ప్రదేశాల్లో చోటు చేసుకున్న పేలుడు, అగ్ని ప్రమాదానికి డ్రోన్ దాడులు కారణమని పోలీసులు పేర్కొన్నారు.














