గ్రామీణ నేపథ్యంలో నడిచే ప్రేమకథా చిత్రం సీతారామపురం లో ఒక ప్రేమజంట. రణధీర్, నందిని రెడ్డి హీరో హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. శ్రీ ధనలక్ష్మి మూవీస్ పతాకంపై ఎం. వినయ్ బాబు దర్శకుడు. సుమన్, సూర్య, అమిత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్ లోని భూత్ బంగ్లాలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకుడు వినయ్ బాబు మాట్లాడుతూ ప్రస్తుతం వస్తోన్న ప్రేమకథా చిత్రాలకన్నా ఎంతో విభిన్నంగా ఈ చిత్రం ఉంటుంది. ప్రేమలో ఉన్న ప్రతి జంట చూడాల్సిన చిత్రం అన్నారు. అలాగే తల్లి దండ్రులకు కూడా మంచి సందేశమిస్తున్నాం అని అన్నారు. నిర్మాత బీసు చందర్ గౌడ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, భద్రాచాలం, చిక్ మంగ్ళూర్, బెంగళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. గ్రామీణ వాతావరణంలో జరిగే చక్కటి ప్రేమకథ చిత్రమిది. కథలో మంచి మలుపులు ఉన్నాయి అన్నారు. ఈ సమావేశంలో సంగీత దర్శకుడు ఎస్.ఎస్. నివాస్, నటుడు భాషా, హీరోయిన్ నందిని రెడ్డి, హీరో రణధీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం ఎస్.ఎస్.నివాస్, కెమెరా: విజయ్ కుమార్.ఎ.














