అమెరికాలో మహాత్ముని విగ్రహానికి మరోసారి అవమానం జరిగింది. అమెరికా ప్రధాన వాణిజ్య నగరం న్యూయార్క్లోని ప్రఖ్యాత మాన్ హటన్ స్క్వేర్లో ఉన్న గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ కాంస్య విగ్రహం ఎత్తు 8 అడుగులు. ఈ ఘటన శనివారం జరిగినట్టు న్యూయార్క్లోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం వెల్లడిరచింది. మహాత్ముడి విగ్రహ ధ్వంసం ఘటనపై స్థానిక అధికారులకు ఫిర్యాదు చేశామని, సమగ్ర దర్యాప్తు చేపట్టాలంటూ అమెరికా విదేశాంగ శాఖ వర్గాలను కోరామని భారత కాన్సులేట్ జనరల్ వర్గాలు తెలిపారు. గాంధీ 117వ జయంతిని పురస్కరించుకుని 1986 అక్టోబరు 2న అంతర్జాతీయ గాంధీ మెమోరియల్ ఫౌండేషన్ ఈ ఎనిమిది అడుగలు నిలువెత్తు విగ్రహాన్ని డొనేట్ చేసింది. 2001లో ఇక్కడ నుండి ఈ విగ్రహాన్ని తొలగించి తిరిగి 2002లో గార్డెన్ ఏరియాలో పున ప్రతిష్టించారు.
గాంధీ విగ్రహం ధ్వంసం చేశారన్న వార్తతో అమెరికాలో భారతీయ సమాజం ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత జాతిపిత గాంధీజీ విగ్రహాన్ని ఈ విధంగా అవమానించడాన్ని తాము ఖండిస్తున్నామని భారత సంతతి సంఘాల చైర్మన్ అంకుర్ వైద్య తెలిపారు. దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత నెలల్లో కూడా కాలిఫోర్నియాలోని ఒక పార్కులో గల ఆరడుగుల గాంధీ విగ్రహాన్ని ఇలాగే ధ్వంసం చేశారు.














